మధ్యతరగతిని మురిపించేనా?.. పన్నుల ఊరట దక్కేనా?

యావత్ దేశం ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2024-25 వేళైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 7వ సారి కేంద్రం పద్దును పార్లమెంట్ ముందు ఉంచబోతున్నారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుపెడతారు. నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ‘మోదీ 3.0 ప్రభుత్వం’లో ఇదే తొలి కేంద్ర బడ్జెట్‌ కావడంతో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.

కాగా ప్రతి బడ్జెట్ మాదిరిగానే ఈ పద్దుపైనా చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి జీవులకు ఆర్థికమంత్రి నిర్మలమ్మ పన్ను రాయితీలు ప్రకటిస్తారా లేదా? అని సామాన్య జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలను మెప్పించిన అంశాలు పెద్దగా లేకపోవడంతో నేటి బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

పన్ను స్లాబులు, ట్యాక్స్ రేట్లను సవరించిన పన్నుల విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 శాతం పన్ను రేటును కేవలం ఆదాయం రూ.20-25 లక్షలు పైబడిన వారికి మాత్రమే విధించాలని డిమాండ్ వినిపిస్తోందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఆదాయం రూ.15 లక్షల పైబడిన వారిపై 30 శాతం ట్యాక్స్‌ను విధిస్తున్న విషయం తెలిసిందే. ఇక సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపుల పరిమితిని పెంచాలనే డిమాండ్ కూడా చాలా కాలంగా ఉంది. సేవింగ్స్‌ పెంపునకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇక స్టాండర్ట్ డిడక్షన్‌ను మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని మధ్యతరగతి జీవులు కోరుతున్నారు. మరి ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

ఇక పన్నుల విధానంలో ఆదాయ పరిమితి పెంపు, బ్యాంకు వడ్డీపై ట్యాక్స్‌కు సంబంధించిన మినహాయింపు, హెల్త్ ఇన్సూరెన్స్, గృహ రుణంపై మినహాయింపులు, క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానం హేతుబద్దీకరణ వంటి అంశాల విషయంలోనూ ఆయా వర్గాలు ఎదురుచూస్తున్నాయని పన్ను నిపుణులు గుర్తుచేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు