కొనేందుకు ఆసక్తి చూపుతున్న జనం..
(మార్కెట్కబుర్లు, హైదరాబాద్):
రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా హైదరాబాద్ నగరం దూసుకెళ్తోంది. ఇళ్ల విక్రయాల్లో ఇప్పుడు 29 శాతం వృద్ధి నమోదైంది. తాజాగా సీఏజీఆర్ గణాంకాల్ని విడుదల చేసింది క్రెడాయి హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఈ రిపోర్ట్ విడుదల చేశారు. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ నగరం.. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్ని దాటుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ హౌసింగ్ సేల్స్
ఐదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేదే ప్రధానంగా క్రెడాయి, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ విలువ ఉండే స్థిరాస్తుల విక్రయాల్లో 760 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మొత్తం అమ్మకానికి లక్షకుపైగా ఇళ్లు ఉన్నాయని.. అంతకుముందుతో పోలిస్తే ఇన్వెంటరీ సమయం తగ్గుతుందని వెల్లడించారు. నిర్మాణ రంగంలో ఐదేళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చాయని.. ప్రాథమిక విక్రయాలు సహా ఇళ్ల ధరలు ఇలా అన్నింట్లోనూ పెరుగుదల నమోదైనట్లు క్రెడాయ్ పేర్కొంది. 5 సంవత్సరాల కిందట నిర్మించిన ఇళ్ల మొత్తం విలువ రూ. 34 వేల కోట్లుగా ఉంటే.. కిందటేడాది ఇది రూ. 1.15 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత సంవత్సరంలో దీనిని అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
– 2019లో 30,316 ఇళ్లు విక్రయించారు. దీని విలువ రూ. 34,044 కోట్లు.
– 2020 లో కరోనాతో ఇళ్ల విక్రయాలు తగ్గగా.. 29,611 మాత్రమే విక్రయించారు. వీటి విలువ అప్పటి మార్కెట్ పరిస్థితిని బట్టి రూ. 33,084 కోట్లుగా లెక్కగట్టారు.
– 2021 లో చూస్తే కరోనా మహమ్మారి అవరోధాల్ని తట్టుకొని మార్కెట్ నిలబడగలిగింది. అంతకుముందు ఏడాది ఎఫెక్ట్తో విక్రయాలు 50,884 పెరిగాయి. ఈ క్రమంలోనే వీటి విలువ రూ. 58,818 కోట్లకు చేరుకుంది.
– 2022 లో 67,276 ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. కరోనా తర్వాత క్రమక్రమంగా ధరలు పెరగడంతో.. విక్రయాల విలువ రూ. 92 వేల కోట్లు దాటింది.
– 2023లో స్థిరాస్తి ప్రాథమిక విక్రయాల విలువ తొలిసారిగా లక్ష కోట్లను దాటేసింది. 74,991 యూనిట్స్ విక్రయించగా.. వీటి విలువ రూ.1.15 లక్షల కోట్లకు చేరుకుంది.
– ప్రస్తుతం అంటే 2024 సంవత్సరం మొదటి 6 నెలల్లోనే.. వీటి విలువ రూ. 58,841 కోట్లుగా నమోదైంది. గత 5 సంవత్సరాల్లో ఇదే అత్యధికం.
– నగరంలో ఈ 6 నెలల్లో జరిగిన మొత్తం అమ్మకాల్లో 62 శాతం నార్త్– వెస్ట్లోనే ఉన్నాయి. వీటి విలువ రూ. 36,276 కోట్లు. నార్త్ ఈస్ట్లో 4,796 యూనిట్లు, సౌత్ వెస్ట్లో 4,957 యూనిట్లు, సౌత్ ఈస్ట్లో 2,998 యూనిట్లు అమ్ముడుబోయాయి.









