(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్):
భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోతున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇదే క్రమంలో ఒక కంపెనీ స్టాక్ మాత్రం దూసుకెళ్తూనే ఉంది. వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. అలాంటి ఒక స్టాక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సన్ షైన్ క్యాపిటల్ షేర్ ధర..
దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం సెషన్లో నష్టాలు వస్తున్నాయి. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల పతనంతో 81 వేల 200 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ ఇదే సమయంలో దాదాపు 300 పాయింట్లు కోల్పోయి 24 వేల 850 మార్కు వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లు పడుతున్నా కూడా కొన్ని షేర్లు మాత్రం దూసుకెళ్తుంటాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కదలాడుతుంటాయి. ఇలాంటి ఒక స్టాక్ గురించే మనం చూద్దాం. వరుస సెషన్లలో ఇది అప్పర్ సర్క్యూట్లు కొడుతోంది. ఇది పెన్నీ స్టాక్ కావడం గమనార్హం. షేరు ధర రూ. 5 లోపే ఉంది. శుక్రవారం సెషన్లో కూడా ఈ స్టాక్ 5 శాతం పెరిగింది.
దీంతో వరుసగా ఆరో రోజు కూడా ఈ స్టాక్ ఎగబాకింది. అదే సన్ షైన్ క్యాపిటల్ లిమిటెడ్. వారం వ్యవధిలోనే ఈ సర్క్యూట్ టు సర్క్యూట్ స్టాక్ ఏకంగా 24 శాతం వరకు పుంజుకుంది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుంచి సానుకూల ప్రకటనలు వస్తుండటంతో స్టాక్ ఎగబాకుతుందని తెలుస్తోంది.
గురువారం రోజు ఈ సంస్థ మరో కీలక ప్రకటన కూడా చేసింది. ఇన్సూరెన్స్ బ్రోకింగ్ బిజినెస్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. భారత్లో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వృద్ధి చెందుతుండటంతో ఇక్కడ అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా పయనించనున్నట్లు పేర్కొంది. కస్టమర్లకు పర్సనలైజ్డ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తామని గురువారం రోజు రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ సంస్థ తెలిపింది. ఇంకా దీనిని అవసరమైన సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో కూడా లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మాత్రమే అందుబాటులో ఉంది.
కిందటి సెషన్లో రూ. 2.55 వద్ద ముగిసిన సన్ షైన్ స్టాక్.. ఇవాళ 4.71 శాతం పెరిగి రూ. 2.67 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతూనే ఉంది. మార్కెట్ విలువ రూ. 1.40 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లోనే ఇది 25 శాతానికిపైగా పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 4.13 కాగా.. కనిష్ట విలువ రూ. 0.46 వద్ద ఉంది. గత 6 నెలల్లో ఈ స్టాక్ 28 శాతం పతనమైంది. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఇప్పటివరకు ఈ షేరు 100 శాతానికిపైగా పెరిగింది. ఏడాది వ్యవధిలో 400 శాతానికిపైగా పెరిగింది.
ఈ కంపెనీకి గతంలో బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ చేసిన ఘనత కూడా ఉంది. చివరిసారిగా 2024, మార్చి 7న ఎక్స్ బోనస్, ఎక్స్– స్ప్లిట్ అయింది. బోనస్ షేర్లను 7:1 నిష్పత్తిలో, స్టాక్ స్ప్లిట్ను 10:1 రేషియోలో జారీ చేసింది.









