హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ‘ప్రాప్‌టైగర్‌’ రిపోర్ట్‌ ఏం చెబుతుందంటే..

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
దేశంలోని టాప్-8 నగరాల్లో.. జులై- సెప్టెంబర్ లో సగటున ఇళ్ల ధరలు 7 శాతం నుంచి 57 శాతం పెరిగినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అత్యధికంగా ఢిల్లీ- NCR ప్రాంతంలో రేట్లు ఎక్కువగా పెరగ్గా.. హైదరాబాద్‌లో తక్కువగా పెరిగాయి. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో చూస్తే సగటున ఇళ్ల ధరలు 3 నెలల్లో 57 శాతం మేర పెరిగాయి. దీంతో ఇప్పుడు చదరపు అడుగు ధర రూ. 8017 కు చేరిందని పేర్కొంది. ఏడాది కిందట సరిగ్గా ఇదే సమయంలో చదరపు అడుగు ధర రూ. 5105గానే ఉండటం గమనార్హం. అంటే సంవత్సరం వ్యవధిలోనే దాదాపు 60 శాతానికిపైగా ఇక్కడ ఇళ్ల ధరలు పెరిగాయన్నమాట.

హైదరాబాద్ నగరంలో చూస్తే.. ఈ మధ్య కాలంలో ధలు పెద్దగా పెరగలేదు. ఇళ్ల ధరలు స్వల్పంగానే పెరిగినట్లు ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఏడాది కిందట ఇదే సమయంలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 6580 గా ఉండగా.. ఇప్పుడు అది రూ. 7050 కి పెరిగింది. ఇళ్ల ధరలు పెరిగేందుకు ప్రధాన కారణంగా.. డిమాండ్ పెరగడం అని.. ముఖ్యంగా అత్యంత విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగిందని తెలిపింది.

ఇందులో ఉన్న డేటా ప్రకారం.. అహ్మదాబాద్ నగరంలో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగి చదరపు అడుగుకు ఇప్పుడు రూ. 4736 కు చేరింది. అంతకుముందు ఇక్కడ రూ. 3900 గానే ఉండేది. బెంగళూరు నగరంలో ఇళ్ల ధరలు 15 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 7512 పలుకుతోంది. చెన్నైలో 22 శాతం పెరగ్గా.. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 7179 కి చేరింది. కోల్‌కతాలో కూడా 22 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 5844 గానే ఉండటం గమనార్హం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం 21 శాతం పెరిగింది. అయితే చదరపు అడుగు ధర ఈ నగరంలో అత్యధికంగా ఉంది. ఇక్కడ చదరపు అడుగు రేటు రూ. 12,590 కావడం గమనార్హం.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు