విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో ఇళ్లు కొనుగోలు చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జీవన విధానానికి ఆకర్షితులై చాలా మంది హైదరాబాద్ లో సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగానే.. గతేడాది ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాల్లో భాగ్యనగరం సరికొత్త రికార్టు సొంత చేసుకుంది. ఏకంగా అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12% వృద్ధి సాధించింది.
గతేడాది కొత్త నిర్మాణాలు, విక్రయాలపై స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. భాగ్యనగరంలో 2023 తో పోల్చితే విక్రయాలు పెరిగినట్లు స్పష్టమవుతుంది. 2024లో కొత్తగా 44,013 నిర్మాణ పనులు పట్టాలెక్కగా, అందులో 36,974 ఇళ్లు అమ్ముడుపోయినట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది.
హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల విక్రయాలతో పాటు ధరలు సైతం పెరిగినట్లు గుర్తించారు. అన్ని రకాల ఇళ్లపై సగటున 8% ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున ప్రారంభమైన ఎల్ బీ నగర్, కొంపల్లిలో ఇళ్ల ధరలు పెరుగుతుండగా… ఎల్బీనగర్లో ఏడాది కాలంలో సగటున 11%, కొంపల్లిలో 10% వరకు ధరలు పెరిగాయి.
నగరంలో విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. గతేడాది విక్రయాల్లో ఏకంగా రూ.1-2 కోట్ల విలువైనవి 45% ఉన్నాయి. గత ఏడాదిలో ఈ శ్రేణిలోనివి 16,459 ఇళ్లు అమ్ముడుకాగా.. ఇప్పుడు వాటి వాటా పెరగడం స్పష్టంగా ప్రజల ఆసక్తిని తెలుపుతోంది. అలాగే.. రూ.2-5 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాల్లో 72%, రూ.5-10 కోట్ల ఇళ్ల అమ్మకాల్లో 39%, రూ.10-20 కోట్ల గృహాల్లో 51% వృద్ధి కనిపించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.









