కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం దగ్గర కొచ్చే కొద్దీ, దానిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బడ్జెట్ లో అందించే మినహాయింపులు, రాయితీలపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారు పన్ను రాయితీలు పెంచుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ పరిధిని పెంచుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరికొద్ది రోజుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే బడ్జెట్పై పూర్తి స్థాయి కసరత్తు పూర్తయింది. అయితే ముచ్చటగా మూడో సారి అది కూడా వరుసగా.. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో పలు వరాలు ప్రకటించే అవకాశముందనే అభిప్రాయం అయితే సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలుమార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ.. ఈ బడ్జెట్ ద్వారా ప్రజల మనస్సులను దోచుకొంటారనే ఊహాగానాలు సైతం ఊపందుకొన్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటేనే.. పలు అంశాలను దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. అయితే వార్షికంగా రూ.15 లక్షల సంపాదించే వ్యక్తులకు ఆదాయపు పన్ను సడలింపు ఉంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పన్నులకు సంబంధించిన పరిభాష తరచుగా గందరగోళానికి కారణమవుతుంది. అయితే పన్ను నిర్వహణ నేపథ్యంలో మూడు కీలకమై అంశాలను పరిశీలించాల్సి ఉంది. అవి.. ఆదాయపు పన్ను మినహాయింపులు, తగ్గింపుతోపాటు రాయితీలు. పన్నులను ఎలా లెక్కించాలనే అంశంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద కొన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులకు మినహాయింపులు లభించే అవకాశం ఉంది.
- మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీములు (ఈఎల్ఎస్ఎస్)
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)
- ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ (ఈపీఎఫ్) విరాళం
- 60 శాతం కనీస కేటాయింపుతో యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్లు (యూఎల్ఐపీ)
- సుకన్య యోజన పథకం కట్టుబడి
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)
- బ్యాంకుల్లో ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్ డ్ డిపాజిట్లు
80సీ పరిధిలోకి వచ్చే ఖర్చులు
- ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీజు
- ఇంటిరుణాలపై అసలు మొత్తం తిరిగి చెల్లించడం
- జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియాలు
- నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) వంటి పెన్షన్ పథకాలకు చెల్లించిన విరాళాలు.
ఆదాయపు పన్ను రిటర్స్స్ దాఖలు చేసినప్పుడు మన ఆదాయం వివరాలతో పాటు పైన తెలిపిన పెట్టుబడులు, ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ శాఖ అధికారుల పరిశీలన అనంతరం నిబంధనల మేరకు పన్ను చెల్లింపుదారుడికి రాయితీలు వర్తింపజేస్తారు. 80 సీ సెక్షన్ కింద మినహాయింపు పరిధి 2014 నుంచి రూ.1.50 లక్షలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెరిగిన జీవన వ్యయం, ఖర్చులు తదితర వాటికి అనుగుణంగా మినహాయింపును పెంచే అవకాశం ఉంది.









