ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 8వ వరుస బడ్జెట్ను సమర్పించనున్నారు. ఇలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పన్ను మినహాయింపుపైనే అందరి దృష్టి ఉంటుంది. సీతారామన్ 2019లో తన మొదటి బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు, బడ్జెట్ డాక్యుమెంట్స్లను తీసుకువెళ్లడానికి దశాబ్దాలుగా ఉపయోగించిన లెదర్ బ్రీఫ్కేస్ను ఎర్రటి గుడ్డతో చుట్టి తీసుకొచ్చారు. అయితే, గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది బడ్జెట్ను కూడా డిజిటల్ రూపంలో విడుదల చేయనున్నారు.
బడ్జెట్ సమావేశంలో అన్ని విషయాలు అర్థం కావాలంటే ముందుకు మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ఆ అంశాలలోని గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ గణాంకాల నుండి భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఈ బడ్జెట్లో దేనిపై దృష్టి పెట్టాలి అనే ఆలోచన కూడా మీకు వస్తుంది.
బడ్జెట్ 2025 ఆర్థిక లోటు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు) బడ్జెట్లో ద్రవ్య లోటు GDPలో 4.9 శాతంగా అంచనా వేయబడింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ద్రవ్యలోటు గణాంకాలను మార్కెట్ నిశితంగా పరిశీలిస్తుంది.
మూలధన వ్యయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయం రూ.11.1 లక్షల కోట్లు. అయితే, లోక్సభ ఎన్నికల కారణంగా మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వ వ్యయం నెమ్మదిగా కొనసాగింది. ఇది మూలధన వ్యయ చక్రంలో జాప్యానికి దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి గణాంకాలు తక్కువగా ఉండవచ్చని అంచనా. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా మూలధన వ్యయం వేగం కొనసాగుతుందని అంచనా.
అప్పుల పరిస్థితి: ఆర్థిక మంత్రి తన 2024-25 బడ్జెట్ ప్రసంగంలో 2026-27 నుండి జిడిపిలో ద్రవ్య లోటును నిరంతరం తగ్గిస్తామని చెప్పారు. ఈసారి మార్కెట్ రుణ ఏకీకరణ ముసాయిదాపై కన్నేసి ఉంచుతుంది. 2024లో సాధారణ ప్రభుత్వ రుణం-జీడీపీ నిష్పత్తి 85 శాతం కాగా, అందులో కేంద్ర ప్రభుత్వ రుణం 57 శాతం.
రుణాలు: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం స్థూల రుణ బడ్జెట్ రూ. 14.01 లక్షల కోట్లు. ప్రభుత్వం తన ఆర్థిక లోటును తీర్చుకోవడానికి మార్కెట్ నుండి రుణాలు తీసుకుంటుంది. మార్కెట్ రుణాలు తీసుకునే సంఖ్యలపై నిఘా ఉంచుతుంది.
పన్ను ఆదాయం: 2024-25 బడ్జెట్లో స్థూల పన్ను ఆదాయం రూ.38.40 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 11.72 శాతం ఎక్కువ. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.22.07 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.33 లక్షల కోట్లు ఉన్నాయి.
GST: 2024-25లో వస్తువులు, సేవల పన్ను (GST) వసూళ్లు 11 శాతం పెరిగి రూ.10.62 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఆదాయ వృద్ధి మందగించినందున 2025-26 ఆర్థిక సంవత్సరానికి GST రాబడి అంచనాలు ఉంది.
GDP వృద్ధి : ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశ GDP వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతంగా అంచనా వేశారు. అయితే వాస్తవ GDP వృద్ధి 6.4 శాతంగా ఉండవచ్చు. ఇది కాకుండా, ఆర్బిఐ, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వానికి వచ్చే డివిడెండ్లు, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాలపై కూడా మార్కెట్ కన్ను వేసి ఉంటుంది.









