భారత స్టాక్ మార్కెట్ (stock market) సూచీలు వారంలో రెండో రోజైన మంగళవారం కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా బెంచ్మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా సూచీలు మొత్తం తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.11 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 315.79 పాయింట్లు క్షీణించి 76,997.01 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 98 పాయింట్లు తగ్గి 23,311.25 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 432 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1013 పాయింట్లు దిగజారింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
మంగళవారం స్టాక్ మార్కెట్లకు అమంగళంగా మారింది. ఈ ఒక్కరోజే 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సూచీ ఏదైనా ప్రస్తుతం రెడ్ కలర్లోనే కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లంతా బేర్ మంటున్నారు. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, స్మాల్, డిక్ క్యాప్ స్టాక్స్లో సైతం అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మార్కెట్లు ఎందకు పడుతున్నాయి? అమ్మకాలకే ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ ఒక్కటే.. అది భయం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధాన కారణం మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారీఫ్లు పెంచారు. మరోవైపు త్వరలోనే తమపై ఎక్కువ టారిఫ్లు విధిస్తున్న దేశాలపై ప్రతీకార టారీఫ్లు విధిస్తానంటున్నారు. దీంతో ట్రేడ్ వార్ భయాలు వెంటాడుతున్నాయి.
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిన్న 2 వేల 463 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. రోజురోజుకు రూపాయి బలహీనపడుతుండం ఈ అమ్మకాలకు కారణంగా తెలుస్తోంది.
బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లూ రెడ్లో ఉన్నాయి. జొమాటో, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.









