అమెరికా టారిఫ్‌ల భయం.. నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు.. గంటల్లోనే లక్షల కోట్ల నష్టం..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా టారిఫ్‌లు భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్లకు పైగా క్షీణించగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 23,200 మార్క్‌ దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.5 లక్షల కోట్లు క్షీణించి రూ.409 లక్షల కోట్లకు పడిపోయింది.

సెన్సెక్స్‌ ఉదయం 76,882.58 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,414.92) నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 75,912.18 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1390.41 పాయింట్ల నష్టంతో 76,024.51 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 353.65 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

పతనానికి కారణాలు..

ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2న తుది నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దేశీయ ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా ఆదాయం వస్తుంది. అలాంటిది అమెరికాలో ఐటీకి ఆశించిన మేర డిమాండ్‌ ఉండకపోవచ్చనే అంచనాలతో ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇటీవల 70 డాలర్ల వద్ద ట్రేడయిన బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర మళ్లీ 75 డాలర్ల స్థాయికి చేరింది. భారత్‌ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశం కావడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇటీవల దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా 8 సెషన్లలో దాదాపు 5 శాతానికి పైగా పెరిగాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలను డీలాపడేలా చేశాయి. వొడాఫోన్‌ ఐడియాలో వాటాను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆ టెలికాం కంపెనీ షేర్లు నేడు 20 శాతం మేర రాణించాయి. స్పెక్ట్రమ్‌ కోసం వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి తాజాగా ఈక్విటీ షేర్లను ప్రభుత్వానికి కేటాయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 22.6% వాటా ఉండగా.. అది తాజాగా 49 శాతానికి పెరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు