టాటా షేర్ల దూకుడు.. రేఖా ఝున్‌ఝున్‌వాలాకు ఒక్కరోజే వందల కోట్ల లాభం..!

ప్రముఖ జువెలరీ, ఐవేర్ బ్రాండ్‌ అయిన టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ షేరు శుక్రవారం ఒక్కసారిగా దూసుకెళ్లింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 5 శాతం వరకు పెరిగి రూ. 3,530 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇది 2 నెలల గరిష్ట స్థాయి కూడా కావడం విశేషం. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతుండగా.. స్టాక్ కాస్త వెనక్కితగ్గింది. వార్త రాస్తున్న సమయంలో సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటలకు 3 శాతానికిపైగా పెరిగి రూ. 3,480 స్థాయిలో ఉంది.

ఈ ఒక్కరోజు టైటాన్ స్టాక్ భారీగా పెరగడంతో.. దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా సంపద ఏకంగా రూ. 700 కోట్లకుపైగా పెరిగింది. మార్చి 2025 నాటికి ఆమెకు టైటాన్ కంపెనీలో 5.15 శాతం వాటా అంటే సుమారు 45,793,470 షేర్లను కలిగి ఉన్నారు. దీంతో ఆమెకు ఒక్క సెషన్లోనే రూ. 735 కోట్ల వరకు లాభం వచ్చింది.

టైటాన్ Q4 ఫలితాలు..

టైటాన్ కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మంచి ఫలితాల్ని నమోదు చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 10.7 శాతం పెరిగి రూ. 870 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 786 కోట్లుగా ఉంది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన చూస్తే 25 శాతం పెరిగి రూ. 12,581 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది రూ.10,047 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ. 12,730 కోట్లుగా నమోదైంది. ఇది వార్షికంగా 23.8 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఇక్కడ విభాగాల వారీగా చూస్తే, జువెలరీ విభాగం రూ. 11,232 కోట్ల ఆదాయంతో 25 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. వాచీలు, వేరబుల్స్ విభాగం 20 శాతం వృద్ధితో రూ. 1,126 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే ఐవేర్ వ్యాపారం 16 శాతం వృద్ధితో రూ. 192 కోట్లకు చేరుకుంది. టైటాన్ అంతర్జాతీయ బ్రాండ్‌లు 47 శాతం వృద్ధిని సాధించాయి. భారతీయ దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఫ్యాషన్ ఉపకరణాలతో సహా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం 5 శాతం పెరిగి రూ. 102 కోట్లకు చేరుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు