బ్రిటన్లోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో హిందూజా గ్రూప్ తన మొదటి స్థానాన్ని పదిలపరుచుకుంది. వరుసగా నాలుగో సంవత్సరం ఈ ఘనత సాధించడం విశేషం. 110 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూజా గ్రూప్నకు ఛైర్మన్గా ఉన్న గోపీచంద్ హిందూజా నేతృత్వంలోని ఈ కుటుంబం, తాజాగా విడుదలైన సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం £35.3 బిలియన్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచింది. సండే టైమ్స్ ఏటా వెలువరించే ఈ జాబితా, యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న అత్యంత ధనవంతులైన వ్యక్తులు, కుటుంబాల వార్షిక ర్యాంకింగ్ను తెలియజేస్తుంది. ఈ సంవత్సరం (2025) జాబితాలో మొత్తం 350 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, హిందూజా గ్రూప్ తన సత్తా చాటింది. ఈ సంస్థలు ప్రపంచంలోని 38 దేశాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా మొబిలిటీ, డిజిటల్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, లూబ్రికెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, హెల్త్కేర్ వంటి అనేక కీలక రంగాలలో ఈ గ్రూప్ పెట్టుబడులు కలిగి ఉంది. గత ఏడాది కాలంలో హిందూజా గ్రూప్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాకుండా, వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా పెట్టుబడులు పెంచింది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025లో ఇతర ప్రముఖ స్థానాల్లో నిలిచిన వారిలో డేవిడ్, సైమన్ రూబెన్ కుటుంబం (£26.873 బిలియన్లు), సర్ లియోనార్డ్ బ్లావంటిక్ (£25.725 బిలియన్లు), సర్ జేమ్స్ డైసన్ కుటుంబం (£20.8 బిలియన్లు), ఇడాన్ ఓఫర్ (£20.121 బిలియన్లు), గై, జార్జ్, అలన్న, గాలెన్ వెస్టన్ కుటుంబం (£17.746 బిలియన్లు), సర్ జిమ్ రాట్క్లిఫ్ (£17.046 బిలియన్లు), లక్ష్మీ మిట్టల్ కుటుంబం (£15.444 బిలియన్లు) ఉన్నారు.