భారత స్టాక్ మార్కెట్లు ఇటీవల తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు, ట్రంప్ టారిఫ్ల గురించిన ఆందోళనలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమనం వంటి కారణాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇతర కీలక రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆరంభంలో ఫ్లాట్గానే ట్రేడైన సూచీలు ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల పతనంతో 81,500 మార్కు వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 24,800 మార్కు దిగువకు పడిపోయింది. అయితే.. ఈ ప్రతికూల వాతావరణంలోనూ ఒక స్టాక్ అసాధారణ పనితీరును కనబరిచి పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది.
2025 మే 20న, హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ (HLE Glascoat) షేరు ధర ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. కిందటి సెషన్లో రూ. 302.20 వద్ద ముగిసిన ఈ స్టాక్ మంగళవారం రోజు రూ. 357.90 వద్ద ఓపెనై ఈ క్రమంలోనే 20 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ. 362.60 వద్ద లాక్ అయింది. ఇది స్టాక్ 3 నెలల గరిష్ట ధర కావడం విశేషం. కంపెనీ నాలుగో త్రైమాసికంలో (Q4FY25) బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో పెట్టుబడిదారులు ఈ స్టాక్ పట్ల ఆసక్తి చూపారు.
ఎందుకు పెరిగింది? కారణాలు ఇవే..
HLE గ్లాస్కోట్ Q4FY25 లో ఏకీకృత నికర లాభంలో 113 శాతం వృద్ధిని సాధించి రూ. 32 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ. 15 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన రాబడి రూ. 307 కోట్ల నుండి రూ. 334 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా గ్లాస్-లైన్డ్ ఎక్విప్మెంట్ విభాగం 31.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆపరేటింగ్ స్థాయిలో ఎబిటా 44 శాతం పెరిగి రూ. 52 కోట్లకు చేరింది. అన్ని విభాగాల నుంచి ఆర్డర్ల కోసం కంపెనీకి ఎంక్వైరీలు వస్తూనే ఉన్నాయని సంస్థ పేర్కొంది.