ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, మల్టీనేషనల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్ రాక్ భారత్లో మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జియో బ్లాక్ రాక్ ఏఎంసీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ ఏఎంసీ కంపెనీ నుంచి 3 కొత్త పథకాలను లాంచ్ చేశారు. మూడు డెట్ ఫండ్స్ జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్ (JioBlackRokc Liquid Fund), జియో బ్లాక్ రాక్ మనీ మార్కెట్ ఫండ్ (Jio Black Rock Money Market Fund), జియో బ్లాక్ రాక్ ఓవర్ నైట్ ఫండ్ (Jio Black Rock Overnight Fund) పేరుతో ఈ స్కీమ్స్ సబ్స్క్రిప్షన్కి వస్తున్నాయి.
ఈ మూడు న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలవగా జులై 2, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత యూనిట్ల అలాట్మెంట్ ఉంటుంది. యూనిట్లు కేటాయించిన 5 పని దినాల్లో ఈ పథకాలు మళ్లీ క్రయ విక్రయాలకు అందుబాటులోకి వస్తాయని జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. ఈ స్కీమ్స్ డైరెక్ట ప్లాన్స్ మాత్రమేనని తెలిపింది. ఆయా పథకాల్లో ఒకసారి (లంప్ సమ్ పెట్టుబడి) పెట్టుబడి పెట్టేందుకు కనీస పెట్టుబడిని రూ.500గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా నెల నెలా ఇన్వెస్ట్ చేసేందుకు సైతం కనీస పెట్టుబడి రూ.500 గా ఉంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ మూడు ఫండ్స్ని విక్రాంత్ మెహతా, అరున్ రామచంద్రన్, సిద్ధార్థ్ దేవ్ నిర్వహిస్తారని జియో ఏఎంసీ తెలిపింది. జియో బ్లాక్ రాక్ లిక్విడ్ ఫండ్ అనేది ఒక ఓపెన్ ఎండెడ్ లిక్విడ్ స్కీమ్. ఇది లో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, లో క్రెడిట్ రిస్క్ కలిగి ఉంటుంది. స్వల్ప కాలిక లక్ష్యంతో మంచి రాబడులు కోరుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. కనీసం 91 రోజుల పాటు మనీమార్కెట్, డెట్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చని సంస్థ చెబుతోంది.