సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచీ ఫార్మా ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలుడు కారణంగా 40 మంది మరణించారు. దీంతో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ ప్రమాదం 2025 జూన్ 30న జరిగింది. కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఆరోపిస్తున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్ షేర్ ధర బుధవారం సెషన్లో 7 శాతానికిపైగా పడిపోయింది. ఐదు రోజులుగా కూడా షేర్ ధర తగ్గుతూనే ఉంది. బుధవారం సెషన్ చివరకు NSE లో 7.58 శాతం నష్టంతో రూ. 42.56 వద్ద స్థిరపడింది. ఘటన జరిగిన రోజు భారీగా పడిపోగా.. గత 3 సెషన్లలో 22 శాతానికిపైగా పతనమైంది. ఇక 5 రోజుల్లో చూస్తే 25 శాతానికిపైగా తగ్గింది. ఈ క్రమంలోనే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా నష్టపోతున్నారని చెప్పొచ్చు.
స్టాక్ ప్రస్తుత ధర 52 వారాల గరిష్ట స్థాయి అయిన 69.75 నుంచి చూస్తే 38.20 శాతం తక్కువ. ఇక స్టాక్ 52 వారాల కనిష్ట ధర చూస్తే రూ. 34 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 1.63 వేల కోట్లుగా ఉంది. ఇక నెల రోజుల్లో ఈ స్టాక్ ధర 20 శాతానికిపైగా పతనమైంది. 6 నెలల్లో 15 శాతానికిపైగా తగ్గింది. ఇక ఏడాది వ్యవధిలో చూస్తే 29 శాతం కుప్పకూలింది.
సోమవారం జరిగిన రియాక్టర్ పేలుడులో 40 మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. పాత పరికరాల గురించి గతంలో హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిపారు. అయితే రియాక్టర్ పేలడం వల్ల ప్రమాదం జరగలేదని కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ అన్నారు. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన స్టాక్ ఎక్స్చేంజీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన ప్లాంట్ను 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు సిగాచీ ఇండస్ట్రీస్ తెలిపింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. “కార్మికుల బీమా క్లెయిమ్లు, వైద్య ఖర్చులు, వారి కుటుంబ పోషణ బాధ్యతలను కూడా చూసుకుంటామని” కంపెనీ తెలిపింది.