మీరు ఒక మంచి ఎస్యూవీ (SUV) కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జీప్ ఇండియా మీకోసం శుభవార్త అందించింది. జులై 2025 కోసం జీప్ తన పాపులర్ ఎస్యూవీ మోడల్స్ అయిన కంపాస్, మెరిడియన్, గ్రాండ్ చెరోకీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడల్ ను బట్టి, కొనుగోలు చేసే వారిని బట్టి, మొత్తం రూ.3.90 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన వేరియంట్లపై వర్తిస్తాయి. కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, అన్ని ప్రయోజనాలు ఒకదానికొకటి కలపడానికి వీలు లేదు. వినియోగదారుల ప్రొఫైల్ ను బట్టి తగ్గింపులు మారుతాయి. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని జీప్ డీలర్షిప్ను సంప్రదించాలని జీప్ సూచించింది.
జీప్ మెరిడియన్పై భారీ ఆదా!
జీప్ మెరిడియన్పైనే అత్యధిక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ నెలలో కొనుగోలుదారులు ఈ మోడల్పై మొత్తం రూ.3.90 లక్షల వరకు ప్రయోజనాలను పొందొచ్చు. ఇందులో రూ. 2.30 లక్షలు నేరుగా వినియోగదారుల డిస్కౌంట్లు ఉన్నాయి. రూ.1.30 లక్షల వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, వైద్యులు లేక లీజింగ్ సంస్థల వంటి కొన్ని ప్రత్యేక వర్గాలకు అదనంగా రూ. 30,000 ప్రత్యేక ప్రోగ్రామ్ కింద అందిస్తున్నారు. అయితే, ఈ రూ.30,000 ప్రత్యేక ఆఫర్ను సాధారణ కార్పొరేట్ డిస్కౌంట్తో కలపలేరు.