(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్):
ధంతేరాస్ వచ్చింది. ఈ పండగ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. దేశంలో ఈ పండగ రోజున ఇంకా ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పొచ్చు. ఇంట్లో శుభం జరుగుతుందని.. అందరికీ శ్రేయస్సు కలుగుతుందని అంటుంటారు. అందుకే.. కనీసం గ్రాము బంగారం అయినా కొనేందుకు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతో డిమాండ్ కాస్త తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది.
ఈ ధంతేరాస్ వేళ కొందరు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వంటివి కూడా కొంటుంటారు. వీటి రేట్లు తక్కువగా ఉండటం కారణంగా చెప్పొచ్చు. దీనిని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ డెలివరీ సంస్థలు.. చక్కటి వ్యాపారంగా మలుచుకున్నాయి. టాటా బ్రాండ్కు చెందిన బిగ్ బాస్కెట్.. తనిష్క్ జువెల్లరీతో కలిసి ఈ పండగ సీజన్లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఇంటికి డెలివరీ చేస్తోంది.
లక్ష్మీ గణేశ్ (999.9 ప్యూరిటీ), సిల్వర్ కాయిన్ (10 గ్రాములు), తనిష్క్ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ (1 గ్రా), తనిష్క్ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ విత్ లక్ష్మీ మోటిఫ్ (1 గ్రా) వంటివి అందిస్తోంది. బిగ్ బాస్కెట్.. ఆర్డర్లు పెట్టిన కస్టమర్లకు 10 నిమిషాల్లోనే హోం డెలివరీ సదుపాయం కల్పిస్తోంది. బిగ్ బాస్కెట్తో పాటుగానే.. దీని ప్రత్యర్థులు బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ కూడా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటించాయి.
ధంతేరాస్ రోజున గోల్డ్, సిల్వర్ నాణేలు, ఇతర పాత్రలు, జువెల్లరీ, ఐడల్స్ వంటివి 10 నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే జార్ నుంచి రూ. 51 వేల వరకు విలువైన రివార్డుల్ని గెల్చుకునే అవకాశం ఉందని పేర్కొంది.









