అదానీ స్టాక్స్‌లో ఎస్బీఐ పెట్టుబడులే ఎక్కువ.. ఏకంగా రూ. 8 వేల కోట్లు..

భారత్‌లో అధికారులకు లంచాలు ఇచ్చారని.. అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా నిధులు సేకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దీంతో ఒక్కసారిగా అదానీ గ్రూప్ స్టాక్స్‌పైన మళ్లీ పిడుగు పడినంత పనైంది. గ్రూప్ స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా నవంబర్ 21న భారీగా పతనమయ్యాయి. మరుసటి రోజు కూడా స్వల్పంగా నష్టాలు నమోదు చేశాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.62 లక్షల కోట్లకుపైగా పడిపోయింది. అయితే.. అదానీ గ్రూప్ కింద మొత్తం 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉండగా.. చాలా మ్యూచువల్ ఫండ్ పథకాలు వీటిల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి.

మొత్తం 43 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉంటే.. వీటిల్లో 38 ఫండ్ హౌసెస్‌కు కలిసి అక్టోబర్ నెలలో దాదాపు రూ. 43 వేల కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి. అన్నింటికంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యూచువల్ ఫండ్ వాటానే ఎక్కువగా ఉంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాటా అదానీ స్టాక్స్‌లో రూ. 8460 కోట్లుగా ఉంది. అందుకే.. అదానీ స్టాక్స్ పడిపోయిన సమయంలో.. ఎస్బీఐ షేరు కూడా భారీగా పతనమైంది.

ఇక రెండో స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ రూ. 6409 కోట్లతో ఉంది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ రూ. 4896 కోట్లతో మూడో స్థానంలో ఉంది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాటా రూ. 430 కోట్లుగా ఉంది. దాదాపు 17 మ్యూచువల్ ఫండ్స్‌కు రూ. 100 కోట్ల కంటే తక్కువ వాటా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వాటా రూ. 58 కోట్లుగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు