కేంద్ర బడ్జెట్ 2025 రానున్న నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుల్ జోరులో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండో సెషన్లో లాభాలతో ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక స్టాక్లు క్రమంగా పుంజుకున్నాయి.
ఈ క్రమంలో ఉదయం 10:08 నాటికి, BSE సెన్సెక్స్ 330 పాయింట్లు పెరిగి 76,231కి చేరుకోగా, నిఫ్టీ 107 పాయింట్లు ఎగబాకి 23,062 వద్ద ట్రైడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 992 పాయింట్లు లాభపడింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు.
ఈ క్రమంలో సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, జొమాటో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడిన స్టాక్స్గా నిలిచాయి. అదే సమయంలో ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్యూఎల్, మారుతి, ఆసియన్ పెయింట్స్ ఈ రోజు ప్రారంభంలో నష్టాలతో ట్రేడయ్యాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఈ రోజు నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1% కంటే ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో మంచి లాభాలను నమోదు చేశాయి.
ఫలితాల నేపథ్యంలో
బజాజ్ ఆటో: డిసెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఆటో 3% వార్షిక (YoY) పెరుగుదలతో రూ. 2,109 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ఫలితాలపై షేర్లు 4.56% పెరిగి రూ. 8,775.40కి చేరుకున్నాయి.
సుజ్లాన్ ఎనర్జీ: ఈ కంపెనీ 90% YoY పెరుగుదలతో రూ. 386.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ఫలితాల తర్వాత సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 5% పెరిగి రూ. 52.76 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకాయి.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL): BHEL Q3 ఫలితాల్లో 123.5% YoY పెరుగుదలతో రూ. 134.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ఫలితాల నేపథ్యంలో BHEL షేర్లు 4% పెరిగి రూ. 196.10కి చేరుకున్నాయి.
JSW ఎనర్జీ: ఈ కంపెనీ Q3లో పన్ను తర్వాత లాభంలో 32% YoY తగ్గుదలతో రూ. 157 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ఫలితాలు JSW ఎనర్జీ షేర్లను 10% పడిపోయి రూ. 453.60 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి.
మహీంద్రా ఫైనాన్స్: ఇదే సమయంలో బీఎస్ఈలో మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్రా ఫైనాన్స్) షేర్లు 3% పడిపోయి రూ. 264.05 ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. Q3FY25కి నికర లాభంలో కంపెనీ వార్షిక ప్రాతిపదికన (YoY) 63% పెరుగుదలను నివేదించింది.









