ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. 2025-26 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో అద్బుత లాభాలతో దుమ్మురేపింది. కంపెనీ నికర లాభం 78.32శాతం పెరిగి రూ.26,994 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.15,138 కోట్లుగా ఉంది. కానీ ఈ సారి రూ.10వేల కోట్ల అధిక లాభం వచ్చింది. కంపెనీ మొత్తం ఆపరేంటింగ్ ఆదాయం కూడా పెరిగింది. రిలయన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గతేడాది తొలి త్రైమాసికంలో రూ.2,36,217 కోట్లగా ఉంది. ఇప్పుడు రూ.2,48,660 కోట్లుగా ఉంది. ఈ లెక్కన 5.27% వృద్ధిని నమోదు చేసింది.
జియో కొత్త సేవలు
జియో ఈ త్రైమాసికంలో ఒక పెద్ద మైలురాయిని సాధించిందని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. తమ 5G కస్టమర్ బేస్ 20 కోట్లు దాటిందని, హోమ్ సర్వీస్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటినట్లు చెప్పారు. జియో వినియోగదారుల కోసం జియోగేమ్స్ క్లౌడ్, జియోపీసీ వంటి సేవలను తక్కువ ధరలకే తీసుకొస్తున్నట్లు తెలిపారు. తద్వారా భారతదేశంలో డిజిటల్ సేవలను ప్రోత్సహించవచ్చన్నారు. జియో బలమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని ఆకాష్ తెలిపారు.
రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ. 84,171 కోట్లకు పెరిగింది. ఇది గతేడాది కంటే 11.3శాతం ఎక్కువ. కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా రూ. 6,381 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ జియో
జియో 200 మిలియన్ల 5G సబ్స్క్రైబర్స్ మార్క్ను దాటింది. హోమ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు కూడా 2 కోట్లు దాటాయి. JioAirFiber ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్గా నిలుస్తోంది. జియో ప్లాట్ఫామ్ల ఆపరేటింగ్ ఆదాయం 24శాతం పెరిగి రూ.18,135 కోట్లకు చేరుకుంది.
చమురు – గ్యాస్ విభాగం
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థిరంగా ఉంది. ఆపరేటింగ్ ఆదాయం రూ.4,996 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.5,210 కోట్లుగా ఉంది.